Minister Ponguleti: రైతులను నష్టపెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు.
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నకలెక్టర్పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు. అధికారుల మీద దాడి అనేది మన మీద మనం దాడి చేసుకున్నట్లేనని తెలిపారు. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: BRS leaders : అధికారంలో ఉన్నా కుట్రలే.. అధికారం లేకపోయిన కుట్రలే : జగ్గారెడ్డి
కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలి. ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వెలగబెట్టిననాడు ఇదే పద్దతి చేశారా? ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు. మల్లన్నసాగర్ లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా? ఎగిసి ఎగిసి పడుతున్న కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా? లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా? అని ప్రశ్నించారు.