KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. నేతన్నల సమస్యలపై లేఖాస్త్రం!

  • Written By:
  • Updated On - April 4, 2024 / 11:59 AM IST

KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్టు విమర్శలకు దాడికి దిగుతున్నాయి. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, అవినీతి ఆరోపణలు చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ లేఖలను సంధిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పలు సమస్యలపై అధికార పార్టీ కాంగ్రెస్ కు ఘాటైన లేఖలు (Open Letters) సంధించారు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను వదిలారు.

‘‘బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా కళకళలాడిన చేనేతరంగం.. మీ కాంగ్రెస్ రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. 2004 నుంచి 2014 వరకు  కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చి నాగులునెలలు గడవకముందే అదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతోపాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతోపాటు కార్మికులు రోడ్డునపడటంతో.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడం వల్ల  వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచింది. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారు. నేతన్నలపైనా కాంగ్రెస్ కున్న చిన్న చూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది’’ అని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.

‘‘కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన మీకు ఒక్క సారి గతం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా ఇవే పరిస్థితులు సమైక్యరాష్ట్రంలో నెలకొని ఉండేవి. తెలంగాణ సాధించాక పాలనా పగ్గాలు చేపట్టిన కేసిఆర్ గారు తెలంగాణలో నేతన్నలను, వస్త్ర పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. చిక్కిశల్యమైన ఈ పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ గారు సమీక్ష నిర్వహించారు. నేతన్నల వేతనాలను, కూలీలను రెట్టింపు అయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదించుకుని గౌరవప్రదంగా జీవించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. చేనేత మిత్రా, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించాము. వీటి కోసం భారీ ఎత్తున గత 60 ఏండ్లలో ఎప్పుడు లేనంత బడ్జెట్ కేటాయించాం’’ అని కేటీఆర్ కాంగ్రెస్ కు గుర్తు చేశారు.

‘‘సంప్రదాయంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తూనే పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం తోడ్పాటునందించింది. మగ్గాల అధునీకీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి అల్ రౌండ్ అప్రోచ్ తో ముందుకు సాగింది. వీటన్నింటి వలన కార్మికులకు ఉరట లభించడంతో, వీరికి మరింత పని కల్పించడంతోపాటు, కడుపునిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన బతుకమ్మ (Bathukamma) చీరల పథకం ప్రారంభించింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా అందించడంతో.. కార్మికులకు చేతి నిండా పని దొరికింది. దీంతోపాటు.. రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింత ఉపాధి పెరిగింది. ఇలా ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల వరకూ వరుస ఆర్డర్లు అందడంతో.. సాంచాల పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసింది. పవర్ లూమ్ లను ఆధునీకరించుకునేందుకు సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడంతో వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్టయింది’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఆ మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో  వస్త్రపరిశ్రమ విస్తరించి ఉన్న  వివిధ ప్రాంతాలతోపాటు.. కాంగ్రెస్ తోపాటు గత ప్రభుత్వాల పాలనలో ఒకప్పుడు ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనింది. వీటికి తోడు నేతన్నకుభీమా అమలుచేయడంతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించింది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కార్మికలోకంలో కొనుగోలు శక్తి కూడా పెరిగింది.. ఓవైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు సమగ్ర అభివృద్ధితో వారి జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. పవర్ లూమ్ కార్మికులు అధికంగా ఉండే… కరీంనగర్, సిరిసిల్లతోపాటు.. వరంగల్, ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు కూడా బీఆర్ఎస్ (BRS) హయాంలో కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడంతో.. వస్త్ర పరిశ్రమకున్న అన్ని సమస్యలు తొలగిపోయాయి’’ అంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించారు.