KTR: ఆ వెబ్ సైట్లు, సోషల్ మీడియాను తొలగించటంపై కేటీఆర్ ఆగ్రహం

  • Written By:
  • Updated On - July 2, 2024 / 09:01 PM IST

KTR: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని కావాలనే ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారికి లేఖ రాశారు. డిసెంబర్ 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందన్నారు. కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్లను కూడా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో ఇదంతా మెయింటెనెన్స్ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కానీ కొన్ని నెలలుగా మరింత సమాచారం కనబడకుండా పోతోన్న సంఘటనలు చూస్తుంటే ఉద్దేశపూర్వంకగానే చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే ఉన్నారనే సందేహం కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన సమాచారాన్ని భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసేందుకు చేస్తున్న ఈ హేయమైన చర్యను ఆపాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్ ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. ఇలా కావాలనే తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఎస్ ను కోరారు.

రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని ఆధారాలు, సమాచారం, డిజిటల్ కంటెంట్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని సీఎస్ కు గుర్తు చేశారు. కేసీఆర్ గారు సీఎం గా ఉన్న (జూన్ 2014 – డిసెంబర్ 2023) నాటి సమయంలోని వేలాది ఫోటోలు, వీడియోలతో పాటు ఎంతో సమాచారాన్ని తొలగించారన్నారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలియజెప్పే సమచారాన్ని కావాలనే వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.