తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు మరో ఆహ్వానం అందింది. మే 21 నుండి 25 వరకు అమెరికా, నెవాడాలోని హెండర్సన్లో జరగనున్న ప్రపంచ పర్యావరణ, జలవనరుల కాంగ్రెస్లో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్’ – ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (ASCE-EWRI) కీలక ప్రసంగం చేయడానికి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. తెలంగాణలో మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంలో , తెలంగాణ పర్యావరణాన్ని మార్చడంలో కేటీఆర్ పాత్ర గురించి వినాలని తాము ఆసక్తిగా ఉన్నామని ఆహ్వాన పత్రంలో, ASCE-EWRI నాయకత్వ బృందం పేర్కొంది.
1852లో స్థాపించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) అమెరికాలోని అత్యంత పురాతన ఇంజనీరింగ్ సొసైటీ. ఇందులో 177 దేశాలలో సివిల్ ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న 1,50,000 కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు. . ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ సంస్థ వార్షిక కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. అప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాలతోపాటు, నీటి సంబంధిత కార్యక్రమాల గురించి వివరించారు.