Kavitha తెలంగాణలో త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మంచి ముహూర్తాల కోసం చూస్తున్నామని.. 3 నెలల్లో పార్టీ ఆవిర్భావం జరుగుతుందని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద చేపను వదిలేసి.. చిన్న చేపలను పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ప్రచారం చేయట్లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత .. తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చిట్చాట్లో కవిత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కవిత.. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషాలు వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు కొన్ని ముహుర్తాలు చేస్తున్నామని.. 3 నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు హద్దు దాటి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయని కవిత పేర్కొన్నారు. జాతిని, నేతలను అవమానించేలా చేసే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్కు అంటూ ఒక పుస్తకమే ఉంటుందని.. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు.
ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్లను కేటాయిస్తామని చెప్పిందని అంతేకాకుండా బీసీ సబ్ప్లాన్ను చట్టబద్ధం చేస్తామని హామీలు ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన గత రెండు బడ్జెట్లలో బీసీలకు ఇచ్చిన హామీ పూర్తిగా అమలు కాలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. చివరి బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు కేటాయింపులను పెంచినప్పటికీ.. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రూ.20 వేల కోట్ల హామీ ఇంక నెరవేరలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లాగానే చట్టబద్ధంగా బీసీ సబ్ ప్లాన్ను మేధావులు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇక రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన పెద్ద చేపను వదిలేసి.. ఈ కేసులో చిన్న చేప అయిన ప్రణీత్ రావుపై సిట్ అధికారులు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు తర్వాత.. నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావును రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఐగా డిమోట్ చేసినట్లు గుర్తు చేశారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న చేపలను పట్టుకుని.. పెద్ద చేపలను వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసును టీవీ సీరియల్లాగా సాగదీస్తున్నారని అన్నారు.
మరోవైపు.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఆ ఆత్మగౌరవ సభ లక్ష్యమని కవిత వెల్లడించారు.
