Hanmakonda Sabha: అవినీతికి పాల్పడ్డ నయాం నిజాంలో భయం మొదలైంది: జేపీ నడ్డా!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బంధీ చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

  • Written By:
  • Updated On - August 27, 2022 / 08:24 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బంధీ చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో నడ్డా ప్రసంగించారు. హన్మకొండ సభకు ఇవాళ ఎక్కడాలేని విధంగా ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ను చూపించి ప్రజలను సభకు రాకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. హైకోర్టు అనుమతితో సభ జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా నడ్డా తెలిపారు.

జల్ జీవన్ మిషన్:

కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారాయన. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం తెలంగాణకు రూ. 3,500కోట్లు కేటాయించినట్లు నడ్డా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 200కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి వరంగల్ జైలును కూల్చేరాని..ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం జరగలేదని వెల్లడించారు నడ్డా.

నయా నిజాం:

అంతేకాదు కేసీఆర్ ను నయా నిజాం అంటూ వ్యాఖ్యానించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే కేసీఆర్ కూడా నడుస్తున్నారన్నారు. ఈ నయా నిజాం తెలంగాణను దోచేస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణను చీకటి నుంచి బయపడేసేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారన్నారు. టీఆరెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి సాగనంపడమే పాదయాత్ర ఉద్దేశ్యమన్నారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ లో ఇప్పుడు భయం అనేది మొదలైందన్నారు నడ్డా. కేసీఆర్ ను ప్రజలు త్వరలోనే ఇంటికి పంపిస్తారన్నారు.