Telangana : “కారు” ముందస్తు హారన్ల హోరు

రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర లేపుతోంది.శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలను పెంచుతోంది.

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 01:05 PM IST

రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర లేపుతోంది.శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలను పెంచుతోంది. పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించడం ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చుతోంది. కేంద్ర ప్రభుత్వం తేదీ ప్రకటిస్తే తాను అసెంబ్లీ రద్దు చేసేందుకు సిద్ధమంటూ మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో నేతలు, పార్టీల్లో హడావుడి సైతం పెరిగింది. వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న సర్వే ఫలితాలు టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉన్నట్లు వస్తున్నందున నియోజకవర్గంపై ‘ఫోకస్‌’ పెంచాలని ఎమ్మెల్యేలకు సీఎం నిర్దేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీల నేతల పనితీరుపై అందుతున్న నివేదికల ఆధారంగా స్థానిక రాజకీయ పరిస్థితులను సీఎం కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఈ నివేదికలలోని అంశాల ఆధారంగా పనితీరును మెరుగు పరుచుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం.

మంజూరైన పనులను పూర్తి చేసి..

ఇప్పటికే నియోజకవర్గానికి మంజూరైన పనులను పూర్తి చేసి ఎన్నికల షెడ్యూలు వెలువడేనాటికి ప్రారంభించి.. వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల బూత్‌వారీగా లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసి ఒక్కో ఇంటికి ఏయే ప్రభుత్వ పథకాల కింద వ్యక్తిగతంగా లబ్ధి జరిగిందనే సమాచారాన్ని రెడీ చేసుకోవడంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. సభలు, సమావేశాలకు పరిమితం కాకుండా లబ్ధిదారులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు ఉండేలా షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు.
వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేయగా.. తర్వాత కూడా అక్కడే ఉండేలా కార్యక్రమాలు రూపొందించు కోవడంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు.

15, 16 తేదీల్లో కీలక భేటీ..

ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేదా 16న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ భేటీలో ఎన్నికల కోణంలో కాకుండా ప్రజలతో మమేకయ్యేందుకు అనుస రించాల్సిన తీరుపై లోతుగా దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పీకే రెండో విడత సర్వేలో ఏముంది ?

పీకే ‘ఐప్యాక్‌’బృందం తెలంగాణ క్షేత్ర స్థాయి పరిస్థితులపై విస్తృత సర్వేలు చేస్తోంది.ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై కేసీఆర్‌కు నివేదికలు ఇచ్చింది. ఇప్పుడు రెండో విడత సర్వేను మొదలుపెట్టింది. తొలి విడత సర్వేలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్‌కే చెందిన ముఖ్య నేతలను పరిగణనలోకి తీసుకుని రిపోర్ట్స్ సబ్మిట్ చేసింది. రెండో విడత సర్వేలో సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఒకటి కంటే ఎక్కువ మంది పేర్లను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాలను సేకరిస్తున్నారు. ఈ నివేదికలు ఆగస్టు మొదటి వారంకల్లా కేసీఆర్‌కు చేరనున్నాయి.