ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజుతో సమావేశమైన తర్వాత సజ్జనార్ మాట్లాడుతూ, ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.
సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై కేసులు బిగుసుకుంటున్న వేళ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన విషయాలు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సమావేశమైన సజ్జనార్.. ఆ తర్వాత వారితో కలిసి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఐబొమ్మ, బప్పం వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు పైరసీ చేయడమే కాకుండా, టెలిగ్రామ్ ఛానళ్లలో కూడా అక్రమంగా కంటెంట్ను అప్లోడ్ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా, సినిమా డౌన్లోడ్ చేసేందుకు సైట్ ఓపెన్ చేస్తే మధ్యలో ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు కనిపించే విధంగా రవి సెట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిపారు. One Win, One X Bet వంటి ప్లాట్ఫారమ్లను బలంగా ప్రమోట్ చేస్తూ, APK ఫైళ్ల రూపంలో యూజర్ల ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత వివరాలను సేకరించాడని సజ్జనార్ స్పష్టం చేశారు.
ఇలాంటి వెబ్సైట్లకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించిన సజ్జనార్… ఫ్రీగా వస్తోంది అనుకుంటారు, కానీ మీ డేటా మొత్తం వాళ్లు దోచుకుంటారు అని తెలిపారు. ఐబొమ్మను ఫ్రీగా సినిమాలను డౌన్లోడ్ చేసుకునే ప్లాట్ఫారమ్గా భావించిన ప్రజలు, దాని వెనుక ఉన్న భారీ బెట్టింగ్ మాఫియా విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ఇమ్మడి రవి “దమ్ముంటే పట్టుకోండి” అని సోషల్ మీడియాలో చేసిన సవాల్ను గుర్తుచేస్తూ “హైదరాబాద్ పోలీసులను తక్కువ అంచనా వేయొద్దు… నెలల తరబడి కృషి చేసి చివరకు అతడిని పట్టుకున్నాం” అని వెల్లడించారు. అరెస్టు తర్వాత పోలీసులు చేసిన పనిపై మీమ్స్ వేస్తున్న వారిపైనా ప్రత్యేక నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఐబొమ్మ వెబ్సైట్తో సినిమా పరిశ్రమలో ఇప్పటివరకూ ఎన్నడూ చూడనంత పెద్ద నష్టం జరిగిన నేపథ్యంలో సినీ ప్రముఖులు సజ్జనార్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. పైరసీని ఎదుర్కొనే ప్రయత్నాల్లో పోలీసులు చూపుతున్న కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్ మరియు కాపీ రైట్ చట్టం కింద మరో నలుగురు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి ’ఇప్పటికే ప్రశాంత్, శివరాజ్ వంటి వ్యక్తులను అరెస్టు చేశాం. రవి కారణంగా సమాజానికి భారీ నష్టం జరిగింది’. పైరసీతో సినీ ఇండస్ట్రీకి నష్టం చేయడమే కాదు, బెట్టింగ్ యాప్ల ద్వారా అనేక కుటుంబాలు నాశనమైపోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇమ్మడి రవి జీవితం, నేర చరిత్ర కూడా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. విశాఖకు చెందిన రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివి, తరువాత వేర్వేరు పేర్లతో మహారాష్ట్రలో లైసెన్స్, పాన్ కార్డులు సంపాదించినట్లు తెలిసింది. పోలీసుల కన్ను పడిన వెంటనే భారత పౌరసత్వం వదిలి, కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్లో నివసిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతూ తన పైరసీ రాకెట్ను నడిపాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి ఇప్పటివరకు 21 వేల సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లు ఏర్పాటు చేసి, 110 డొమైన్లతో మిర్రర్ సైట్లను నిర్వహించాడు. దీని ద్వారా మొత్తం రూ.20 కోట్ల వరకు సంపాదించాడని అందులో రూ.3 కోట్లు ఇప్పటికే సీజ్ చేశామని సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా 50 లక్షల మందికి పైగా యూజర్ డేటా రవి వద్ద ఉండటం అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు ఇక్కడితో ముగిసిపోదని, రవికి సహకరించిన మిగతా సభ్యులను కూడా పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు. టాలీవుడ్లో పైరసీపై సాగుతున్న ఈ యుద్ధంలో పోలీసుల కఠిన చర్యలు పరిశ్రమకు ఊరట ఇస్తున్నాయి.
