Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా మందకొడిగా మారిన నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం తెలంగాణ పరిధిలో ఇవి కొంత ముందుకు కదిలాయని.. రానున్న 24 గంటల్లో రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా […]

Published By: HashtagU Telugu Desk
Heavy rain forecast for several districts in Telangana.

Heavy rain forecast for several districts in Telangana.

ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా మందకొడిగా మారిన నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం తెలంగాణ పరిధిలో ఇవి కొంత ముందుకు కదిలాయని.. రానున్న 24 గంటల్లో రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా వాటి గమనం ఒక్కసారిగా మందగించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణ ఆలస్యమైంది. తాజాగా.. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు పుంజుకున్నాయి.

ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అలాగే బుధవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. గురువారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరిగి పైన పేర్కొన్న జిల్లాలతో పాటు పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు.. హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వర్షం నేటి (మంగళవారం) ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులుగా కురుస్తూనే ఉంది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారింది. రానున్న 24 గంటల్లో హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేందుకు 50 శాతానికి పైగా అవకాశాలు ఉన్నాయి. వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, పాత భవనాల వద్ద ఆగరాదని ట్రాఫిక్ పోలీసులు, వాతావరణ శాఖ సూచించారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.1 సెం.మీ, మంచిర్యాల జిల్లా తాండూర్‌లో 3.8 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అయితే, ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ.. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రం ఇంకా వడగాలుల ప్రభావం కొనసాగుతుండటం గమనార్హం. రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తేనే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి.. రైతులకు విత్తనాలు వేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

  Last Updated: 23 Jun 2026, 10:10 AM IST