Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్

  • Written By:
  • Updated On - April 3, 2024 / 09:25 AM IST

Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు.. సీఎం రేవంత్ కు వరుస లేఖలు అందిస్తున్నారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ.. వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా లేఖలో రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదు’’ అని ఆయన గుర్తు చేశారు.

‘‘బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నది. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతున్నది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలు తో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు’’ లేఖ ప్రస్తావించారు హరీశ్ రావు.

‘‘కెసిఆర్ నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు లక్ష రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఏ ఓక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు. లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలను మేమే కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రుణమాఫీ పొందగలిగారు. కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానమూ ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం నేటివరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా, లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. ఈ అనిశ్చితి.. గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతున్నది. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి. దీంతో వారు రైతుల మీద పడుతున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత. తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు 70 శాతం వరకు ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులను గోస పెట్టడం ఏమాత్రం సమ్మతం కాదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాట మీకు నేను గుర్తు చేయాల్సిన అవసరంలేదు. రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించే విధంగా.. మీరిచ్చిన హామీలన్నిటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తున్నా’’ అని హరీశ్ రావు అన్నారు.