Hyderabad : పాత‌బ‌స్తీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఆస్తి వివాదంపై రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 10:05 AM IST

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఆస్తి విషయంలో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో మిర్‌చౌక్‌ ప్రాంతంలో ఒక న్యాయవాది రైఫిల్‌తో కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి మీర్ ఆలం సమీపంలోని మగర్ కి బౌలి వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు మిర్‌చౌక్ పోలీసులకు సమాచారం అందింది. ఘ‌ర్ష‌ణ ప‌డిన వారు మసూద్ అలీ ఖాన్ (న్యాయవాది), ముర్తుజా అలీ ఖాన్, హష్మతునిసా బేగం, మహ్మద్ ఖలీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ అకా అర్ఫాత్, మహ్మద్ అనీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ, ఇబ్రహీం అలీ ఖాన్, సుల్తానా మరియు ఇతర కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వాగ్వాదం సందర్భంగా, న్యాయవాది మసూద్ అలీ ఖాన్ తన రైఫిల్ నుండి ప్రత్యర్థి వర్గంపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలు రాళ్లదాడికి దిగడంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌చౌక్‌ పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని మీరాలం మండిలోని మగర్‌కీ బౌలిలో కొనసాగుతున్న ఆస్తి తగాదాలే ఈ ఘర్షణకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అర్థరాత్రి సమయంలో మసూద్ అలీ ఖాన్ బృందం వివాదాస్పద ఆస్తికి తాళం వేయగా, ప్రత్యర్థి వర్గం తాళాలను బలవంతంగా తెరిచింది. ఈ సమయంలోనే మసూద్ అలీఖాన్ తన నివాసం నుండి లైసెన్స్ కలిగిన రైఫిల్‌ని వెలికితీసి గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. జాయింట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కోఆర్డినేషన్‌ గజరావు భూపాల్‌, ఇతర పోలీసు అధికారులతో కలిసి రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మిర్‌చౌక్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.