Telangana Government తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్. త్వరలోనే గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు చట్టబద్ధత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లుకు చట్టబద్దత తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. బిల్లుకు చట్టబద్ధత వస్తే.. ప్రత్యేక బోర్డు ద్వారా గిగ్ కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్లు, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ప్రసూతి సహాయం వంటివి అందనున్నాయి.
- తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్
- సంక్షేమ బిల్లుకు త్వరలో చట్టబద్ధత
- ప్రత్యేక బోర్డు ద్వారా కార్మికులకు సాయం
తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా గిగ్ వర్కర్లతో సమావేశమై.. వారి సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిగ్వర్కర్ల ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ప్లాట్ఫాం ఆధారిత గిగ్వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు-2025కు సర్కార్ చట్టబద్ధత ఇవ్వనుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లును ఈనెలాఖరున జరిగే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించి.. బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండురోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో ఇచ్చిన హామీ మేరకు గిగ్వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురావాలని రాహుల్ గాంధీ సీఎం రేవంత్కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు కార్మిక శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ బిల్లుకు చట్టబద్ధత లభిస్తే తెలంగాణలో పనిచేస్తున్న దాదాపు నాలుగు లక్షల మంది గిగ్ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుతోపాటు కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కానుంది. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకనిధిని సైతం ఏర్పాటు చేస్తుంది. గిగ్వర్కర్లకు సంబంధించిన బిల్లును గత ఏడాదే కేబినెట్ ఆమోదం తెలిపింది.
గిగ్వర్కర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక బోర్డుకు ఛైర్మన్గా కార్మికశాఖ మంత్రి, సభ్యులుగా ఇతర కార్మిక శాఖ అధికారులు, ప్రతినిధులు ఉంటారు. గిగ్, అగ్రిగేటర్లు, ప్లాట్ఫాం వర్కర్లు ఈ చట్టానికి లోబడి బోర్డు వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కార్మికుల వివరాలను సంక్షేమ బోర్డు వెబ్పోర్టల్లో నమోదు చేస్తుంది. అగ్రిగేటర్లు 60 రోజుల్లో నమోదైన గిగ్వర్కర్ల డేటాను బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ పథకాల కోసం ప్రభుత్వం సంక్షేమ నిధిని సైతం ఏర్పాటు చేయనుంది. ఈ నిధికి అగ్రిగేటర్లు గిగ్వర్కర్కు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపుల్లో 1 శాతానికి తక్కువ 2 శాతానికి మించకుండా జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధి ద్వారా ఇన్సూరెన్స్, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ప్రసూతి సహాయం బోర్డు అందించనుంది.
