Kazipet Railway Route : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు 110.46 కి.మీ మేర రూట్లో రెండు రైల్వే లైన్లే ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు రైల్వే లైన్లను నాలుగుకు విస్తరించనున్నారు. అదనంగా రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన వివరాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసి ఇటీవలే రైల్వేబోర్డుకు పంపింది. ఈ అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.2,837 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభిస్తే, రైల్వే శాఖ నుంచి ఈ ప్రాజెక్టుకు మంజూరు లభిస్తుంది. మంజూరు తేదీ నుంచి నాలుగేళ్లలోగా ఘట్కేసర్ టు కాజీపేట రూట్లో అదనంగా రెండు రైల్వే లైన్లను నిర్మిస్తారు. అంటే దాదాపు 2030 సంవత్సరం నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read :Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?
ఘట్కేసర్ టు కాజీపేట రూట్ వస్తే.. ఏమవుతుంది ?
- దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్.
- సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
- సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కోల్కతాల వైపు వెళ్లే రైళ్లకు కూడా కాజీపేటనే ప్రధానమార్గం.
- ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైళ్ల రాకపోకలతో సికింద్రాబాద్ – కాజీపేట రైల్వే రూట్ నిత్యం కిటకిటలాడుతుంటుంది.
- ఈ రూట్ నుంచే దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏటా భారీ ఆదాయం సమకూరుతోంది.
- సెక్షన్ ట్రాక్ కెపాసిటీ వినియోగం 100 శాతంలోపు మాత్రమే ఉండాలని రైల్వే రూల్స్ చెబుతున్నాయి. అయితే ఇది సికింద్రాబాద్ – కాజీపేట రూట్లో 128 శాతంగా ఉంది.
- కొత్తగా రెండు రైల్వే లైన్లను నిర్మించిన తర్వాతే.. ‘సెక్షన్ ట్రాక్ కెపాసిటీ వినియోగం’తో ముడిపడిన సమస్య పరిష్కారం అవుతుంది.
- ఈ మార్గంలో రైళ్ల హాల్టింగ్లు తగ్గుతాయి.
- సికింద్రాబాద్ – కాజీపేట రూట్లో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకల కోసం రెండు ప్రత్యేక లైన్లను కేటాయిస్తారు. తద్వారా వాటిలోని ప్రయాణికులు వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది.
- ఈ రూట్లో గూడ్సు బండ్లకు ప్రత్యేక మార్గం అందుబాటులోకి వస్తుంది.
- ఇక ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కోసం మూడో రైల్వే లైను ఇప్పటికే మంజూరైంది.
- ఘట్కేసర్-రాయగిరి వరకు నాలుగో లైను, రాయగిరి నుంచి కాజీపేట వరకు 3, 4 లైన్లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు.