Govt Schools – Facial Recognition : గవర్నమెంట్ స్కూళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) ఆధారిత సరికొత్త టెక్నాలజీ ఒకటి వినియోగంలోకి రానుంది. విద్యార్థులు, సిబ్బంది అటెండెన్స్ ను నమోదు చేసేందుకు ‘ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్’ సిస్టమ్ ను వాడనున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, నాగాలాండ్ సహా చాలా రాష్ట్రాల్లోని స్కూళ్లలో ఇప్పటికే ఈ విధానంలో అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఆ సిస్టమ్ ను వాడుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. ఫలితాలు ఆశాజనకంగా రావడంతో వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి ఆ పద్ధతిని తెలంగాణవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ అమలుకు అవసరమైన ట్యాబ్ లను టీచర్లకు పంపిణీ కూడా చేశారు. వెయ్యిలోపు విద్యార్థులున్న స్కూల్ కు ఒక ట్యాబ్, వెయ్యి కంటే ఎక్కువమంది ఉన్న స్కూళ్లకు రెండు ట్యాబ్లను పంపిణీ చేశారు.
ప్రస్తుతం ‘ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్’ సిస్టమ్ సాఫ్ట్వేర్ను ట్యాబ్లలోకి ఇన్ స్టాల్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే.. ముఖం ద్వారా అటెండెన్స్ నమోదు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇది పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. స్టూడెంట్స్ / సిబ్బంది ముఖాన్ని చూడగానే కెమెరా స్కాన్ చేసి, దానికదే అటెండెన్స్ ను నమోదు చేస్తుంది. అనంతరం క్లాస్ టీచర్ ట్యాబ్ కెమెరాను తెరిచి స్కాన్ చేయగానే.. అందులో ఉన్న ఎఫ్ఆర్ఎస్ అప్లికేషన్ కాగ్నిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని తన డాటాబేస్లో నమోదైన స్టూడెంట్స్/సిబ్బంది ఫొటోలతో (Govt Schools – Facial Recognition) పోల్చుకుంటుంది. ఆయా ముఖాల ఆధారంగా క్లాసుకు ఎంత మంది హాజరయ్యారనే లెక్కలు చూపిస్తుంది. తక్కువ హాజరుశాతం ఉన్నప్పుడు టీచర్ ను అలర్ట్ చేసేలా ట్యాబ్ లో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.