Harish Rao : కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు..

పక్క రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి

  • Written By:
  • Updated On - June 17, 2024 / 08:15 PM IST

బిఆర్ఎస్ మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ..కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి..? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైంది..? 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి 6 నెలలు దాటినా ఎందుకు ఇవ్వడం లేదు..? పక్క రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పింఛన్ పెంచి ఇస్తున్నప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు..? ఆశావర్కర్లు, ఎన్ హెచ్ఎం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది..ఎందుకు ఇవ్వడం లేదు..? అలాగే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు వాటిపై స్పందించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా కనీసం ఖాతా తెరవకుండా దారుణం ఓటమి పాలైంది. దీంతో రోజు రోజుకు బిఆర్ఎస్ పార్టీ దారుణంగా తయారవుతుందంటూ అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ హామీల అమలు ఏమయ్యాయి అంటూ పలు డిమాండ్స్ ను వ్యక్తం చేసారు.

హరీష్ రావు ఏమన్నారనేది చూస్తే..

గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించమని వేడుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెర్మైన్ దగ్గరికి వెళ్తే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉందంటున్నారు. ప్రజా దర్బార్‌కు వెళ్లి కాళ్లమీద పడ్డా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరామ్ దగ్గరికి వెళ్లినా స్పందన లేదు. కొత్త హామీలను కాకుండా మీరు ఇచ్చిన హామీలన అమలు చేయమని కోరుకుంటున్నారు.

కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది అని హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల తరఫున ఐదు డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెడుతున్నాం.

1.గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలి.

2.గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి.

3.పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జూలైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.

4.ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? హామీని నిలబెట్టుకోవాలి.

5.25 వేల పోస్టులతో కాకుండా 11 వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు ప్రకటించారు? మొత్తం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి అని డిమాండ్ చేసారు.

అలాగే పింఛన్లు ఫై..

4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి 6 నెలలు దాటినా అమలు చేయడం లేదు. మే నెల పింఛన్ ఇంకా ఇవ్వలేదు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్ కూడా ఎందుకివ్వడం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు.

ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామని ఎందుకు అమలు చేయడం లేదు..? పేదల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం?
పక్క రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి.

ఒక్కొక్కరికి 12 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. ఈనెలకు కలిపి మొత్తం 16 వేలు ఇవ్వాలి. దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 4 వేల పింఛన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీ మాట ప్రకారం 6 వేలు ఇవ్వండి. మేం అధికారంలోకి వచ్చినప్పుడు 28 లక్షల పింఛన్లు ఉంటే దిగిపోయేనాటికి 44 లక్షల పింఛన్లు ఉన్నాయి. ప్రతి ఏటా 12 వేల కోట్లు పింఛన్లు కేటాయించాం. పెండింగ్ ఫింఛన్ చెల్లించి కొత్త పింఛన్లు మంజూరు చేయాలి అని అన్నారు.

ఇక ఆశా వర్కర్లు, అంగన్వాడీల జీతాలు..

ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇవ్వడం లేదని ఆశావర్కర్లు, ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18వ తేదీన జీతాలిస్తున్నారు. 1వ తేదీనే జీతాలిస్తే హైదరాబాద్ వచ్చి ఎందుకు దర్నా చేస్తారు..? గ్రామ పంచాయతీ పారిశుధ్య వర్కర్లకు 5 నెలలుగా జీతాలు అందడం లేదు. తమ సొంత ఖర్చులతో డీజిల్ పోయించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సఫాయీ కార్మికలకంటే పేదలింకెవరు ఉంటారు.

సీఎంఆర్ఎఫ్ ‌కు సంబంధించి 65 వేల చెక్కులు ప్రింట్ అయి పంపిణీకి రెడీగా ఉన్నాయి. కేసీఆర్ బొమ్మ ఉందనే కారణంతో ఆపారు. మీ ఫొటో పెట్టి ఇవ్వండి. అంగన్వాడీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు రావడంలేదు. వాళ్లకు వేరే పనులు చెప్పి వేధిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు దేశంలో ఎక్కువ జీతాలు కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వస్తున్న జీతం కూడా ఇవ్వడం లేదు.

నీట్ పరీక్షపై హరీష్ రావు ప్రశ్న ..

నీట్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ హయాంలో సంపద కొందరి చేతుల్లోకి వెళ్లినట్టే విద్య కూడా కొందరి చేతుల్లో వెళ్తోంది. 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. రెండేళ్లు నిద్రాహారాలు మాని చదువుకున్నారు. గ్రేస్ మార్కులు, పేపర్ లేకేజీ ఆందోళన కలిగిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనట్లు 67 మందికి ఫస్ట్ ర్యాంకు ఎలా వస్తుంది? ఒకే సెంటర్లో రాసిన ఆరుగురికి 720 మార్కులెలా వచ్చాయి..? గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది పేర్లు, క్రైటీరియా బయటపెట్టాలి. నీట్‌లో గ్రేస్ మార్కుల విధానమే లేనప్పుడు ఎలా కలిపారు..? ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి, పార్లమెంటు ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారు..? ఎన్నో అనుమానాలున్నాయి. దీనిపై ప్రభుత్వం సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరపడం లేదు..? పేపర్ లీక్ కాకపోతే బిహార్, గుజరాత్‌లో ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి..? తెలుగు విద్యార్థులకు అన్యాయం జరక్కుండా బీజేపీ ఎంపీలు, మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలి. ఇంత ప్రధాన సమస్యమై మీరెందుకు మాట్లాడ్డం లేదు..?

మెడికల్ ఎడ్యుకేషన్ చాలా కీలకం. పేదలకు వైద్యవిద్య అందాలని మేం జిల్లాకొక మెడికల్ కాలేజీ పెట్టాం. మీరు పేపర్లు లీక్ చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారు. నీట్ అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

అలాగే తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేసారు. సోషల్‌ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లుగా కొందరు రాస్తే.. బీజేపీలో చేరబోతున్నట్లుగా మరికొందరు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాబోతున్నానంటూ ఇంకొందరు తమకు నచ్చినట్లుగా రాసుకుంటూ వెళ్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వార్తల కారణంగా నేతల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని.. ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు. తన క్రెడిబిలిటిని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయ‌త్నం చేస్తే చట్టప‌రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు.

Read Also : Rahul Gandhi: వాయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ