Free Bus Travel : మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి మహిళలు ఉచితంగా బస్సులో జర్నీ చేస్తున్నారు. త్వరలోనే బస్ పాస్ మాదిరిగా మహాలక్ష్మి పథకం స్మార్ట్ కార్డులను మహిళలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇతరత్రా బస్సు పాస్లను కూడా స్మార్ట్ కార్డులు(Free Bus Travel) మార్చాలని తెలంగాణ ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
బస్సు టికెట్ తీసుకునే సమయంలో చిల్లర సమస్య వస్తుంటుంది. దానికి చెక్ పెట్టేందుకుగానూ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ను కూడా త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని బండ్లగూడ డిపోలో ఉన్న కొన్ని బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ డిపోల పరిధిలో ఈ పేమెంట్ విధానం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బస్సు టికెట్ల డిజిటల్ పేమెంట్ కోసం ఇంటెలీజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ పేరుతో ఐ-టిమ్స్ను అందుబాటులోకి తెచ్చారు. వీటిని బండ్లగూడలోని బస్సులతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో గత మూడు నెలలుగా వాడుతున్నారు. ఐ-టిమ్స్ ద్వారా బస్సు ప్రయాణికుల నుంచి యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్నారు. దీంతో ఆయా బస్సుల్లో చిల్లర సమస్య తీరిపోయింది. త్వరలోనే అన్ని బస్సుల్లోనూ ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. చిల్లర బాధకు తెరపడుతుంది.
బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఆర్టీసీ రూ.10.97 కోట్లు వెచ్చించి 13వేల ఐ-టిమ్స్ను కొనుగోలు చేసింది. జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. తొలి విడతగా పదివేల ఆర్టీసీ బస్సుల్లో ఐ-టిమ్స్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు.