రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

Rajya Sabha : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ మరియు సురేశ్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఆ స్థానాల భర్తీపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చలు సాగుతున్నాయి. ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

సింఘ్వీకి పునర్నియామక అవకాశం

రాజ్యసభలో చురుకైన వక్తగా న్యాయ నిపుణుడిగా గుర్తింపు పొందిన అభిషేక్ మను సింఘ్వీకి మళ్లీ అవకాశం దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర స్థాయిలో పార్టీ తరఫున తన వాదనలు బలంగా వినిపించిన సింఘ్వీకి రీన్యువల్ ఇవ్వాలని అధిష్టానం సానుకూలంగా ఉందన్న సమాచారం వినిపిస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి ఆయన పేరే ఖరారవుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే రెండో స్థానానికి మాత్రం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. పార్టీకి విశ్వసనీయంగా పనిచేసిన పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. ముఖ్యంగా బెల్లయ్య, వీహెచ్, మధుయాష్కీ, నరేందర్ రెడ్డి, కోదండరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్లు చర్చల్లో వినిపిస్తున్నాయి. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థి ఎంపిక జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మహేశ్ గౌడ్ – అజహరుద్దీన్‌పై ప్రచారం

ఇక మరో ఆసక్తికర ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ను రాజ్యసభకు పంపే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు అధిష్టానం పెద్ద బాధ్యత అప్పగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా జరిగితే ఆయన స్థానంలో ఎమ్మెల్సీగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ను నియమించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా ఉన్న అజహరుద్దీన్‌కు పార్టీ కీలక పదవి ఇవ్వవచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు మరింత వేగం అందుకున్నాయి.

రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశముంది. ఒకవైపు అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేక కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలా? అన్న దానిపై పార్టీ అధిష్టానం తూకం వేస్తోంది. దీంతో ఈ రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలకు పరీక్షగా మారాయి. సీనియార్టీ, సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత రానుంది.

  Last Updated: 23 Feb 2026, 12:26 PM IST