Jagga Reddy: జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Jagga Reddy

Jagga Reddy

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరో రెండు నెలల వరకు ఇలాగే మౌనంగా కొనసాగుతూ నవంబర్లో పెద్ద పొలిటికల్ బాంబు పేల్చడానికి సిద్ధంయినట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.
గతంలో ఒకసారి రాజీనామా చేసి, ఆపై ఉపసంహరించుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

మరోమారు జగ్గారెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నెల రోజులుగా సైలెంట్ గా ఉంటున్న జగ్గారెడ్డి నవంబరు నెల వరకూ ఇదే పంథాను కొనసాగిస్తారని, ఆ లోపు పార్టీలో మార్పు రాకపోతే అఏం చేయాలి? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి
కాంగ్రెస్ పార్టీ లో జరిగే రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించే జగ్గారెడ్డి అందుకు భిన్నంగా సైలెంట్ గా ఉన్నారు. అంతేకాదు నెల రోజులకు పైగా గాంధీ భవన్ కు దూరంగా ఉంటూ జగ్గారెడ్డి తన నియోజక వర్గానికే పరిమితమై రాజకీయాలు చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారు అని పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తీరుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయినా ఇప్పటివరకు జగ్గారెడ్డి కనీసం ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. ఆయన కూడా త్వరలోనే పార్టీకి షాక్ ఇస్తారు అన్న చర్చ పార్టీలో ఆసక్తికరంగా మారింది.

  Last Updated: 12 Aug 2022, 09:32 AM IST