Municipal Election Campaign : తెలంగాణలో మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన వేళ, అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు వేడెక్కాయి. క్షేత్రస్థాయిలో ప్రచారం ఆశించిన స్థాయిలో సాగకపోవడం, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో ప్రచారానికి దూరంగా ఉండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రచారానికి గడువు సమీపిస్తున్నా, మెజారిటీ మున్సిపాలిటీల్లో నాయకులు ఉదాసీనంగా వ్యవహరించడంపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారంతో సీఎం అప్రమత్తమయ్యారు. కేవలం అభ్యర్థులు మాత్రమే ప్రచారంలో కనిపిస్తూ, పార్టీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని ఆయన పార్టీ నేతలకు గట్టి క్లాస్ పీకారు.
అసంతృప్తి సెగలు – సీఎం హెచ్చరికలు
ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారు, పదవుల కోసం ఎదురుచూస్తున్న వారు అలక వహించి ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారింది. వీరిని బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని గతంలోనే సూచించినా, జిల్లా నేతలు ఆ దిశగా చొరవ చూపకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ను ఎండగట్టడంలో ఎందుకు వెనుకబడి ఉన్నారు? అత్యంత కీలకమైన ఈ ఎన్నికలను తేలికగా తీసుకుంటే ఫలితాలు తారుమారవుతాయి” అని ఆయన నేతలను నిలదీశారు. టీపీసీసీ చీఫ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా, ప్రచారం మందకొడిగా సాగుతున్న జిల్లాల నేతలకు స్వయంగా ఫోన్ చేసి, తక్షణమే రంగంలోకి దిగాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.
బిజీ షెడ్యూల్లోనూ పక్కా వ్యూహం
ముఖ్యమంత్రిగా జిల్లాల పర్యటనలు చేస్తూనే, రేవంత్ రెడ్డి ప్రతిరోజూ రాత్రి వేళల్లో పార్టీ ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూ, ప్రతి వార్డులో పార్టీ పరిస్థితిని బేరీజు వేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు విఫలమైతే అది వ్యక్తిగత వైఫల్యంగానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం, పనిచేయని నాయకులను గుర్తించి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
