మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ ‘సీట్ల దొంగతనానికి’ పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల దొంగతనం తర్వాత ఇప్పుడు బీజేపీ సీట్ల దొంగతనానికి దిగిందని ఆరోపించారు. తెలంగాణకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మధ్యప్రదేశ్లో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు.
ఈ వ్యవహారంపై జైరాం రమేష్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్నారని సమాచారం. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్ అంతర్గత నేతలే తమకు అందించారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు చెప్పడం గమనార్హం. మరోవైపు, ప్రతిపక్షాలను అణచివేసి, దేశంలో ఏక పార్టీ పాలనను స్థాపించడానికే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.
