పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో మల్కాజిగిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పాశవిక దారుణానికి పాల్పడిన కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరికి సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో ఉమ్మెత్త పొడితో విషమిచ్చి.. కత్తులతో నరికి శరీర భాగాలను బకెట్లలో దాచిన నిందితుల నేరం రుజువు కావడంతో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఈ శిక్షను ఖరారు చేశారు.
పెన్షన్ డబ్బులు, బ్యాంకులో ఉన్న డిపాజిట్ల కోసం కన్నతండ్రిని అత్యంత క్రూరంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్లలో దాచిన కేసులో కుమారుడితో పాటు కుమార్తెకు ఉరిశిక్ష విధిస్తూ మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి వ్యూహం రచించి సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వి.బాలభాస్కర్ రావు తీర్పు చెప్పారు. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మౌలాలి పరిధిలోని రైల్వే కాలనీలో నివసించే మారుతి సుతార్ (70) ఒక విశ్రాంత రైల్వే ఉద్యోగి. ఆయనకు భార్య గంగాబాయి, కుమారుడు కిషన్ సుతార్, కుమార్తెలు అనుపమ, ప్రపుల్ల ఉన్నారు. పెద్ద కుమార్తె అనుపమకు పెళ్లై పుణెలో స్థిరపడగా.. కుమారుడు కిషన్, చిన్న కుమార్తె ప్రపుల్ల ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేవారు. మారుతి సుతార్కు ప్రతి నెలా రైల్వే శాఖ నుండి వచ్చే రూ. 30 వేల పెన్షన్ డబ్బులతోనే ఆ ఇల్లు గడిచేది. అయితే.. ఖాళీగా ఉండే పిల్లలు అడిగినప్పుడల్లా మారుతి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు తండ్రిపై తీవ్ర కక్ష పెంచుకున్నారు. మారుతి అడ్డు తొలగించుకుంటే ఆయన పింఛనుతో పాటు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తమ సొంతం అవుతాయని భార్య, కొడుకు, కూతురు కలిసి తండ్రిని చంపేందుకు పథకం వేశారు.
హత్య ఎలా చేయాలి, ఆనవాళ్లు లేకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై కుమార్తె ప్రపుల్ల ఇంటర్నెట్లో విస్తృతంగా శోధించినట్లు పోలీసు విచారణలో తేలింది. అందులో భాగంగా.. 2019 ఆగస్టు 16న ఉమ్మెత్త పూలు, కాయలను తీసుకొచ్చి ఎండబెట్టి వాటిని పొడి చేశారు. మొదట ప్రయోగాత్మకంగా మారుతి తినే భోజనంలో ఆ పొడిని కలిపి పరీక్షించారు. రెండు రోజుల పాటు కొద్దిపాటి మోతాదులో ఇచ్చి చూసిన అనంతరం.. మూడో రోజు ఆగస్టు 18న విషం మోతాదును పెంచారు. దీంతో మారుతి తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వృద్ధుడైన తండ్రి స్పృహ కోల్పోగానే.. ఏమాత్రం జాలి లేకుండా కత్తులతో ఆయనను పాశవికంగా నరికి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లోని ప్లాస్టిక్ బకెట్లలో నింపి దాచిపెట్టారు.
నిందితులు ఆ శరీర భాగాలను ఎవరూ లేని సమయంలో బయట నిర్జన ప్రదేశంలో పడేయాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురింట్లో ఒక శుభకార్యం జరుగుతుండటంతో వీధిలో జనాల సంచారం ఎక్కువగా ఉండటంతో వారి ప్లాన్ ముందుకు సాగలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత ఇల్లాంతా ఘోరమైన దుర్వాసన రావడం ప్రారంభమైంది. అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బకెట్లలో కుళ్లిన స్థితిలో ఉన్న శరీర భాగాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. స్థానికులు తేరుకునేలోపే గంగాబాయి, ప్రపుల్ల.. కిషన్ను తీసుకువస్తామంటూ అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయారు.
స్థానికుల సమాచారంతో అప్పటి మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన చార్జ్షీట్ను కోర్టులో సమర్పించారు. విచారణలో నేరం పక్కాగా రుజువు కావడంతో న్యాయమూర్తి వారికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.
