CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ!

వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr

Cm Kcr

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్న నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సీఎం తెలిపారు. జిల్లాలల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా వుండాలని సీఎం అన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టాలను జరగకుండా చూసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.

భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం విఙప్తి చేశారు. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవెన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎం తెలిపారు.

  Last Updated: 09 Jul 2022, 04:55 PM IST