Bandi Sanjay Padayatra : అంత‌టా టెన్ష‌న్‌! బండి యాత్ర ర‌భ‌స‌!

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఐదో విడ‌త పాద‌యాత్ర ప్రారంభం కాకుండానే ర‌భ‌స కు దారితీసింది.

  • Written By:
  • Updated On - November 28, 2022 / 01:46 PM IST

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఐదో విడ‌త పాద‌యాత్ర ప్రారంభం కాకుండానే ర‌భ‌స కు దారితీసింది. ఆయ‌న ముందుకు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం నిర్మ‌ల జిల్లా భైంసా వ‌ద్ద యాత్ర‌ను ప్రారంభించాలి. అక్క‌డికి చేరుకోవ‌డానికి క‌రీంన‌గ‌ర్ నుంచి బ‌య‌లుదేరిన సంజ‌య్ ను పోలీసులు జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం వెంక‌టాపూర్ శివార్లో అడ్డుకున్నారు. ఆయ‌న్ను కరీంనగర్ లోని ఇంటికి త‌ర‌లించి గృహనిర్బంధం చేశారు. ప్ర‌తిగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు దిగారు. పోలీసుల వైఖ‌రి, కేసీఆర్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌డుతూ క‌మ‌ల‌నాథులు రంగంలోకి దిగారు. ఫ‌లితంగా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా అంత‌టా ఉత్కంఠ నెల‌కొంది.

యాత్ర‌ను నిరాక‌రించిన పోల‌సుల వైఖ‌రిని ప్ర‌శ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. దానిపై విచార‌ణ చేసిన ఆంక్ష‌ల‌తో కూడిన యాత్ర‌కు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమ‌తి లేదంటూ ప‌లు నాట‌కీయ ప‌రిణామ‌ల న‌డుమ బండిని హౌస్ అరెస్ట్ చేసిన విష‌యం విదిత‌మే.

Also Read:  Mallareddy : నేడు ఐటీ విచారణకు హాజరుకానున్న మంత్రి మల్లా రెడ్డి..!

తొలుత కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సంజ‌య్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో క్యాడ‌ర్ వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో ఎలా ర‌ద్దు చేస్తారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు ఇదే నిదర్శనమని, ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భైంసా సున్నితమైన ప్రాంతమని చెబుతున్న పోలీసులకు యాత్ర‌కు అనుమ‌తి ఇచ్చే ముందు తెలియదా? అని ఫైర్ అయ్యారు. భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అంటూ ధ్వజమెత్తారు. ఒవైసీ కుటుంబానికి ప్రత్యేక దేశంగా భైంసాని అప్పగిస్తున్నారా అంటూ బండి దుయ్యబట్టారు. భైంసా నిషేధిత ప్రాంతమా అని ప్రశ్నించిన బండి సంజయ్, భైంసానే కాపాడలేని సీఎం, రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారని మండిపడ్డారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ రాకకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, రూట్‌ మ్యాప్‌ ప్రకటించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలేంటని నిల‌దీశారు.

బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. నిర్మల్‌ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. భైంసాలో బండి సంజయ్‌ పాదయాత్రకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా మాల్యాల చౌరస్తా నుంచి కరీంనగర్ వెళ్లే రోడ్డుపై టైర్లు కాల్చారు బీజేపీ కార్య‌క‌ర్త‌లు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్.. పోలీసుల తీరుపై మండిపడ్డారు.

Also Read:  Revanth Reddy: కాంగ్రెస్ లో `భూ` కుంభ‌కోణం! రేవంత్ వ‌ద్ద సీనియ‌ర్ల అక్ర‌మాలు!!

ఇది జరిగిన కాసేపటికి పోలీసులు బండి సంజయ్‌న్ కరీంనగర్‌లోని ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు సంజయ్‌ ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ భైంసాలో సభ పెట్టే తీరుతామంటున్న బండి సంజయ్‌ వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో కరీంనగర్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.