Site icon HashtagU Telugu

Phone Tapping Case: విదేశీ గడ్డపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌, శ్రవణ్‌ ఆలోచన అదేనా ?

Phone Tapping Case Prabhakar Rao Sravan Rao Foreign Courts Telangana

Phone Tapping Case: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులోని కీలక నిందితులు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా ఛానల్‌ నిర్వాహకుడు శ్రవణ్‌రావు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ అమెరికాలో, శ్రవణ్  కెనడాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది.  వారిద్దరు తెలంగాణకు తిరిగొచ్చేందుకు మొగ్గు చూపకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అమెరికా, కెనడాలలోని కోర్టులను ఆశ్రయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలంగాణ పోలీసులు సైతం ఆయా దేశాల్లోని కోర్టుల్లో న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై భారత విదేశాంగ శాఖ సాయం కోసం అభ్యర్థన పంపినట్లు తెలుస్తోంది.

Also Read :Kishan Reddy : సడెన్‌గా ఢిల్లీకి కిషన్ రెడ్డి.. అసలు కారణం అదేనా ?

అమెరికా, కెనడా కోర్టుల్లో.. 

నిందితులు ప్రభాకర్, శ్రవణ్‌లు(Phone Tapping Case) అమెరికా, కెనడాలలోని కోర్టుల్లో రెడ్‌కార్నర్‌ నోటీసులను సవాలు చేసే ఛాన్స్ ఉంది. రాజకీయ కారణాలతోనే తమపై కేసులు పెట్టారని వాదించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స చేయించుకోవాల్సి ఉందంటూ తమ అప్పగింతను ఆపాలని అక్కడి కోర్టులను నిందితులు కోరుతారని అంచనా వేస్తున్నారు. అమెరికా, కెనడాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసే న్యాయవాదులు ఈ కేసులో తెలంగాణ పోలీసుల తరఫున వాదనలు వినిపించనున్నారు.

Also Read :Yubari King Melon : ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏంటో..? దాన్ని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

అప్పీల్ చేస్తూ.. 

ఆ దేశాల్లోని కిందిస్థాయి కోర్టుల్లో తీర్పు ప్రతికూలంగా వచ్చినా.. అప్పీల్ చేస్తూ ఉన్నత స్థాయి కోర్టు వరకు వెళ్లేందుకు ప్రభాకర్, శ్రవణ్‌లు మొగ్గు చూపొచ్చు. అదే జరిగితే అమెరికా, కెనడాల్లో ఈ కేసు కొలిక్కి రావడానికి కనీసం మరో ఏడాది పట్టొచ్చు. ప్రభాకర్, శ్రవణ్‌ల పాస్‌పోర్టులను భారత ప్రభుత్వం ఇంకా శాశ్వతంగా రద్దు చేయలేదు. ఎందుకంటే.. వాటిని రద్దు చేయొద్దంటూ వారిద్దరూ ఢిల్లీలో ఉన్న చీఫ్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌‌ వద్ద పిటిషన్ వేశారు.