తెలంగాణలో బీజేపీ నాయకులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బీజేపీ నాయకత్వం చేరికలపై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో సినీ గ్లామర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అమిత్ షాతో ఎన్టీఆర్, నడ్డాతో నితిన్ భేటీ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక జీవిత రాజశేఖర్, విజయశాంతి లాంటివాళ్లు బీజేపీలో ఉన్నారు. జయసుధ కూడా బీజేపీలో చేరనున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మరో నటి, టీడీపీ మాజీ నాయకురాలు దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో సినీనటి దివ్యవాణి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. వీరి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దివ్యవాణిని బీజేపీలోకి ఈటల ఆహ్వానించినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆమె కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దివ్యవాణి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. త్వరలో అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.