Students Suicide: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య

ఇంటర్‌లో ఫెయిల్ అయి తక్కువ మార్కులు వచ్చాయని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య (Students Suicide) చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 08:51 AM IST

Students Suicide: ఇంటర్‌లో ఫెయిల్ అయి తక్కువ మార్కులు వచ్చాయని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య (Students Suicide) చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన విద్యార్థి (16) జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివాడు. 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన విద్యార్థి (17) హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఇంటర్ మొదటి సంవత్సరం (బైపీసీ) చదివాడు. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తిరుపతికి చెందిన విద్యార్థి (17) ఈసీఐఎల్ రామకృష్ణాపురంలో ఉంటూ పటాన్ చెరులో ఇంటర్ (ఎంపీసీ) చదివాడు. ఫెయిల్ అవుతానని మనస్తాపం చెంది సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి-మేడ్చల్ రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు పట్టాలపై మృతదేహం లభ్యమైంది. ఆ విద్యార్థి ఫలితాలు తెలియరాలేదు. గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి (17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. మొదటి సంవత్సరం సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి (17) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) చదివింది. విఫలమవడంతో ఆమె ఇంట్లో ఉరేసుకుంది. సికింద్రాబాద్ నేరేడ్‌మెట్‌లోని ఠాణా పరిధిలోని వినాయక్ నగర్‌కు చెందిన విద్యార్థి (17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: imran arrest public protest : టార్గెట్ పాక్ ఆర్మీ .. ఇమ్రాన్ పార్టీ క్యాడర్ నిరసనల తుఫాను

ఖైరతాబాద్ తుమ్మలబస్తీకి చెందిన విద్యార్థి (17) ఎస్సార్‌ నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ (బైపీసీ) ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన విద్యార్థి (17) ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 365 మార్కులు సాధించింది. మార్కులు తక్కువ రావడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్థిని అదృశ్యం

ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని అదృశ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయిలు కథనం ప్రకారం.. పటాన్‌చెరు సమీపంలోని పాటి గ్రామంలో నివసించే భవాని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేదు. తిరిగి వస్తానని సోదరికి చెప్పి బయటకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగి రాలేదు.