West Indies: ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించి ఇప్పుడు సూపర్-8లో జింబాబ్వేతో తలపడుతోంది. అయితే ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ వెస్టిండీస్ జట్టు జాతీయ గీతం (National Anthem) వినిపించలేదు. మిగతా జట్ల జాతీయ గీతాలు ప్లే అవుతుంటే విండీస్ విషయంలో మాత్రం అది జరగకపోవడం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
వెస్టిండీస్ జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు?
ఏ ఐసీసీ టోర్నమెంట్లోనైనా వెస్టిండీస్ జాతీయ గీతం ప్లే చేయరు. ఎందుకంటే వెస్టిండీస్ అనేది ఒక దేశం కాదు. ఇది క్రికెట్ ఆడటానికి ఏకమైన 15 కరీబియన్ దేశాల సమూహం. ఇందులో ఆంటిగ్వా & బార్బుడా, బార్బడోస్, డొమినికా, గ్రెనడా, గయానా, జమైకా, సెయింట్ లూసియా, ట్రినిడాడ్ & టొబాగో వంటి పలు స్వతంత్ర దేశాలు, ద్వీపాలు ఉన్నాయి.
Also Read: ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!
ప్రతి దేశానికి వేర్వేరు జాతీయ గీతాలు ఉండటంతో మ్యాచ్ల సమయంలో జాతీయ గీతానికి బదులుగా వారి క్రికెట్ గీతాన్ని (Cricket Anthem) ప్లే చేస్తారు. ఈ సంప్రదాయం 1999లో ప్రారంభమైంది. డేవిడ్ రూడర్ పాడిన ప్రసిద్ధ కాలిప్సో పాట ‘రాలీ అరౌండ్ ది వెస్ట్ ఇండీస్’ (Rally ‘Round the West Indies)ను వారు తమ క్రికెట్ గీతంగా స్వీకరించారు. ఈ పాటను 1980వ దశకంలో రాశారు.
జాతీయ గీతాలకు 20 నిమిషాల సమయం పడుతుంది!
వెస్టిండీస్ జట్టులో పలు దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఒకవేళ మ్యాచ్కు ముందు ఆ 15 దేశాల జాతీయ గీతాలను ప్లే చేయాల్సి వస్తే దానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. 1999 కంటే ముందు ఆ సమయంలో కెప్టెన్గా ఉన్న ఆటగాడు ఏ దేశానికి చెందినవాడో, ఆ దేశ జాతీయ గీతాన్ని ప్లే చేసేవారు. అయితే దీనిపై ఇతర దేశాల ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో క్రికెట్ గీతాన్ని తీసుకువచ్చారు. ఇటీవలి కాలంలో యువ అభిమానులను ఆకట్టుకోవడానికి వెస్టిండీస్ జట్టు తమ హోమ్ సిరీస్ల సమయంలో మికల్ తేజా పాడిన ‘ఫుల్ ఆహా ఎనర్జీ’ (Full Ah Energy) అనే పాటను కూడా ప్లే చేస్తోంది.
