MS Dhoni : నందిగామలో ధోనీ 41 అడుగుల కటౌట్‌

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 03:35 PM IST

మ‌న దేశంలో క్రికెట్‌ మతమైతే… క్రికెటర్లను దేవుళ్లలానే పూజిస్తారు. మ్యాచ్ గెలిస్తే సంబరాలు… ప్రపంచకప్ గెలిస్తే అంతకుమించిన హంగామా.. అన్నింటికీ మించి ఆటగాళ్ళను ఆకాశానికెత్తేస్తారు. ఇక వారి పుట్టినరోజుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన క్రికెటర్ల బర్త్‌డేను పండుగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అందులోనూ భారత మాజీ కెప్టెన్, మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు అంటే.. మామూలుగా ఉండ‌దు. సంబరాలు అంబ‌రాన్ని అంటాల్సిందే. ఇవాళ ధోనీ 41వ ఏట అడుగుపెడుతుండగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ధోనీ ఫ్యాన్స్ బర్త్‌డేను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ బర్త్‌డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ అభిమానులు తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. మామూలుగా సినిమా హీరోలకు భారీ ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు పెట్టి హడావుడి చేసే ఏపీ యువకులు త‌మ ఫేవ‌రేట్ క్రికెట‌ర్ ధోనిపై కూడా అభిమానాన్ని చాటుకున్నారు.

 

ధోనీ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను ప్రత్యేకం చేసుకునే క్రమంలో విజయవాడ సమీపంలోని నందిగామలో 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కటౌట్‌లో ధోని ట్రేడ్‌మార్క్‌ హెలికాప్టర్ షాట్ ఆడుతున్నట్టు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ల‌క్షలాది లైక్స్, వేలాది కామెంట్స్ వ‌చ్చాయి. అంబారుపేట గ్రామానికి చెందిన ధోనీ అభిమానులు ఈ కటౌట్‌ ఏర్పాటు చేశారు. తమకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ ధోనీ పుట్టిన రోజున 41 అడుగుల కటౌట్ తో పాటు 41 కేజీల కేక్ ను కట్ చేశామ‌ని తెలిపారు. జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేయ‌డంతో కటౌట్ వాహనదారులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ధోని క‌టౌట్ పెట్ట‌డం ఇదే తొలిసారి కాదు.. గతంలో కేరళలో 35 అడుగులు కౌటౌట్ ను, చెన్నైలో 30 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా..తాజాగా ఇప్పుడూ ధోని 41వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో 41 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇక 2007లో టీ ట్వంటీ ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌ అందించిన ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా… ఐపీఎల్‌లో ఆడుతున్న మహికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అటు ఎండోర్స్‌మెంట్స్‌లోనూ, బ్రాండ్ వాల్యూలోనూ ప్రస్తుత ఆటగాళ్ళతో పోటీపడుతున్నాడు.