vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు తన సమయం ఆసన్నమైందని అతను పరోక్షంగా సంకేతాలిచ్చాడు. […]

Published By: HashtagU Telugu Desk
Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు తన సమయం ఆసన్నమైందని అతను పరోక్షంగా సంకేతాలిచ్చాడు.

అయితే, వైభవ్‌ను జట్టులోకి తీసుకురావడానికి తొందరపడాల్సిన అవసరం లేదని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్లకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. “టీ20 క్రికెట్‌లో మన నెం.1 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శాంసన్‌లను మనం గౌరవించాలి. కోచింగ్ సిబ్బందిగా, ఆటగాళ్లపై విశ్వాసం చూపడం, వారికి మద్దతు ఇవ్వడం మా ధర్మం. ఒక యువ ఆటగాడు తలుపు తడుతున్నాడనేది నిజంగా ఉత్సాహాన్నిచ్చే విషయమే. కానీ, ప్రస్తుత ఆటగాళ్లకు అండగా నిలవడం చాలా ముఖ్యం” అని మోర్కెల్ వివరించాడు.

ప్రపంచకప్‌లు గెలిచిన, కఠిన పరిస్థితుల్లో రాణించిన ఆటగాళ్లకు అండగా నిలవడం ద్వారానే జట్టును మరింత బలోపేతం చేయగలమని మోర్కెల్ పేర్కొన్నాడు. ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని అన్నాడు.

మరోవైపు వైభవ్ సూర్యవంశీ ప్రతిభను మోర్కెల్ ప్రశంసించాడు. “అంతర్జాతీయ స్థాయిలో 15 ఏళ్ల వయసులో నెట్స్‌లో ఆడటం భయపెట్టే విషయమే అయినా, వైభవ్ మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాడు. మేము చూసిన కొన్ని నెట్ సెషన్లలోనే అతను అద్భుతంగా రాణించాడు. అతడి నెట్ ప్రాక్టీస్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జట్టులో అతను సులభంగా కలిసిపోయాడు. అవకాశం వచ్చినప్పుడు, అతను దానికి సిద్ధంగా ఉంటాడని నేను కచ్చితంగా చెప్పగలను” అని మోర్కెల్ అన్నాడు.

ఈ నేపథ్యంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి వైభవ్‌కు అవకాశం ఇస్తారేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. యూకే పర్యటనలో గత మూడు ఇన్నింగ్స్‌లలో సంజూ కేవలం 5, 0, 1 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో యువ ప్రతిభకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టీమ్ మేనేజ్‌మెంట్ సంజూపై వేటు వేసే అవకాశం లేకపోలేదు. తుది నిర్ణయం టీమ్ మేనేజ్‌మెంట్‌దే కావడంతో రెండో టీ20లో తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

  Last Updated: 04 Jul 2026, 11:15 AM IST