Site icon HashtagU Telugu

IND vs ENG 3rd Test: టీమ్ లో నో ప్లేస్… సెలక్టర్లపై సీనియర్ పేసర్ సెటైర్లు

IND vs ENG

IND vs ENG

IND vs ENG 3rd Test: ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమేశ్ భావించగా…నిరాశే మిగిలింది. దీంతో సెలెక్షన్ కమిటీపై వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా హిందీ కొటేషన్ షేర్ చేసిన ఉమేశ్ యాదవ్ బోర్డుపై సెటైర్లు వేశాడు. పుస్తకాలకు దుమ్ముపట్టినంత మాత్రాన అందులోని కథలకు విలువ తగ్గదు అనే ఓ హిందీ కొటేషన్‌ను షేర్ చేశాడు.

సొంతగడ్డపై టెస్ట్‌ల్లో ఉమేశ్ యాదవ్‌కు మంచి రికార్డ్ ఉంది. 2018 నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్ యాదవ్ 43 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్ల పడగొట్టాడు. అయినా ఉమేశ్ యాదవ్‌కు సెలక్టర్లు మొండిచెయ్యి చూపించారు. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు పెద్దగా మార్పులేమి చేయకపోయినా గాయంతో శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అలాగే ఆవేశ్ ఖాన్‌ను తప్పించి యువ పేసర్ ఆకాశ్ దీప్‌కు అవకాశం ఇచ్చింది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ ఆటగాళ్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ కారణంగానే పుజారా, రహానే, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లను పక్కన పెట్టేశారు.

Also Read: Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?