Nikhat Zareen : దేశం గ‌ర్వించేలా ఆడుతా.. టీపీసీసీ స‌న్మాన స‌భ‌లో బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌

బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స‌న్మానించింది. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు

  • Written By:
  • Publish Date - January 9, 2023 / 07:22 AM IST

బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స‌న్మానించింది. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు బహుమతిగా ప్రకటించామ‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తామంతా జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే ఈ బహుమతిని ప్రకటించామ‌ని.. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిజాం క్లబ్ లో కార్యక్రమం ఏర్పాటు చేసామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామ‌ని.. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవన్నారు. రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవస‌ర‌మ‌ని.. మగవాళ్ళు ఆడే ఆట అని అడ్డు చెప్పకుండా జరీన్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించారని.. ఇందుకు నిఖత్ జరీన్ కుటుంబాన్ని ప్ర‌త్యేకంగా రేవంత్ రెడ్డి అభినందించారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ జరీన్ కు స్థలాన్ని కేటాయించాలని.. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని రేంవ‌త్ రెడ్డి డిమాండ్ చేశారు.

26 జనవరిలోగా గ్రూప్ 1 ఆఫీసర్ గా నిఖ‌త్ జ‌రీన్‌ని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని..మరింత గొప్పగా నిఖత్ జరీన్ ను సన్మానించేలా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నాని రేవంత్ రెడ్డి తెలిపారు. లక్షలాదిమంది విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత‌ల‌కు రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించినందుకు కాంగ్రెస్ నేత‌ల‌కు బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి బహుమతి ప్రకటించడం సంతోషంగా ఉందని.. అందరి సపోర్ట్ ఉంటే దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తాన‌ని నిఖ‌త్ తెలిపారు.