ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఈ కుర్రాడు వీరబాదుడు బాదాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేళ్లతో ‘A’ సింబల్ చూపిస్తూ చేసిన సంబరాలు నెట్టింట వైరల్గా మారాయి.
సీక్రెట్ ఇదే
మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్ మురళీ కార్తీక్ ఆ ‘A’ సింబల్ సెలబ్రేషన్స్ గురించి వైభవ్ను అడిగారు. మొదట వైభవ్ కాస్త నవ్వుతూ సరదాగా దాటవేసే ప్రయత్నం చేశాడు. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి అలా చేశానని చెప్పాడు. కానీ చివరకు అసలు రహస్యాన్ని బయటపెట్టి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు.
అద్భుతమైన ఇన్నింగ్స్ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవుతుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించానని స్పష్టం చేశాడు. అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైభవ్ వీరకొట్టుడు
వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా తర్వాత గేర్ మార్చాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తర్వాత మరింత రెచ్చిపోయి కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్
ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. ముంబై ఇండియన్స్తో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం అవుతుంది. ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.
