రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్ తుది అంకానికి చేరింది. ఇవాళ జరిగే ఫైనల్లో ఇండియా లెజెండ్స్ , శ్రీలంక లెజెండ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు జట్లూ ఈ సీజన్ లో ఓటమి ఎరుగవు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ గ్రూప్ స్టేజీలో 2 మ్యాచ్ లు గెలవగా.. మరో 3 మ్యాచ్ లు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. అలాగే టేబుల్ టాపర్గా నిలిచిన శ్రీలంక లెజెండ్స్ కూడా , గ్రూప్ స్టేజీలో 5 మ్యాచులు ఆడి 4 విజయాలు అందుకుంది. మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.
ఇదిలా ఉంటే మొదటి సెమీ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ,ఆస్ట్రేలియా లెజెండ్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని ఫైనల్ చేరింది. మరో సెమీ ఫైనల్లో శ్రీలంక వెస్టిండీస్ పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో సచిన్ , నమన్ ఓజా, పఠాన్ బ్రదర్స్ తో పాటు స్టువర్ట్ బిన్నీ సూపర్ ఫామ్ లో ఉన్నారు. సురేష్ రైనా, యువరాజ్ సింగ్ మెరుపులు పూర్తి స్థాయిలో అభిమానులు చూడలేదు. దీంతో తుది పోరులో వీరిద్దరూ కూడా రాణిస్తే ఇండియా లెజెండ్స్ కు తిరుగుండదు. మరోవైపు లంక లెజెండ్స్ టీమ్ లో ఉపుల్ తరంగా, చమర సిల్వా, జీవన్ మెండిస్, ఉదాన, కులశేఖర కీలకం కానున్నారు.