Site icon HashtagU Telugu

Team India: 15 ఏళ్ల త‌ర్వాత పాకిస్థాన్‌కు టీమిండియా..?

ICC Champions Trophy

ICC Champions Trophy

వచ్చే ఏడాది పాకిస్థాన్‌ గడ్డపై టీమిండియా క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది. ఆసియా కప్-2023 కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియా క‌ప్‌ టోర్నీ జరగనుంది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఇది సాధ్యమవుతుందని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు. ప్రస్తుతం బీసీసీఐ ఎజెండాలో ఈ అంశం చేర్చబడింది. అక్టోబర్ 18న జరిగే ఏజీఎంలో దీనిపై చర్చించ‌నున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ ఓ నివేదిక‌లో పేర్కొంది.

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్రకారం.. 2023లో వన్డే ఫార్మాట్‌లో జరిగే కాంటినెంటల్ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే 2008 నుంచి పాకిస్థాన్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా దూరంగా ఉంటుంది. 15 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా మళ్లీ టీమిండియా దాయాది గడ్డ‌పై ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఆసియా కప్‌ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లనుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. టీమిండియా 2008లో పాకిస్థాన్‌లో చివరి మ్యాచ్ ఆడింది. అప్పటి నుండి రెండు జట్లు తటస్థ వేదికపై ఆడుతున్నాయి. ఇరు జ‌ట్ల‌ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. ఆసియా క‌ప్-2023 టోర్నమెంట్ తేదీ ఇంకా ఖ‌రారు కాలేదు.

‘ఉగ్రవాదం-క్రికెట్ కలిసి కాదు’ అనే స్టాండ్‌తో ఇండియా-పాకిస్థాన్ జ‌ట్ల‌ మధ్య క్రికెట్ సంబంధాలు చాలా కాలంగా జ‌ర‌గలేదు. ఎందుకంటే.. ‘ఉగ్రవాదం-క్రికెట్ కలిసి కాదు’ అనే స్టాండ్‌ను భారత్‌ కొనసాగిస్తోంది. అయితే ఆసియాక‌ప్‌-2023 టోర్నీపై ఏసీసీ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం ఎప్పటిలాగే తప్పనిసరి అని స్ప‌ష్టం చేశారు. కాగా పాక్‌లో మెగా టోర్నీలు ఆడేందుకు పలు దేశాలు విముఖత చూపిన నేపథ్యంలో పీసీబీ యూఏఈని వేదికగా ఎంచుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version