Suryakumar Yadav: న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరిగింది. జట్టులో ఆయన స్థానంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. అయితే కివీస్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ ముగిసే సమయానికి టీ20 ఫార్మాట్లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ ‘స్కై’ తన పాత జోరును ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గణాంకాల్లో భారీ మార్పు
సూర్య గత ఏడాది కంటే ఈ ఏడాది కేవలం ఒక్క నెలలోనే మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
2025లో: మొత్తం 21 మ్యాచ్ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశారు.
2026లో (జనవరిలోనే): కేవలం 5 మ్యాచ్ల్లోనే 242 పరుగులు సాధించారు.
గత ఏడాది చేసిన మొత్తం పరుగులను ఈ ఏడాది కేవలం జనవరిలోనే అధిగమించడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనకు గాను సూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.
Also Read: Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం
విరాట్ కోహ్లీ రికార్డు సమం
ఈ అవార్డుతో సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. సూర్య ఇప్పటివరకు 6 సార్లు టీ20 ఫార్మాట్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఆయన విరాట్ కోహ్లీ, వానిందు హసరంగ సరసన నిలిచారు. వీరిద్దరూ కూడా 6 సార్లు ఈ అవార్డును అందుకున్నారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తూ సిక్సర్లు, ఫోర్ల వర్షంతో మ్యాచ్ గమనాన్ని మార్చడంలో సూర్య మళ్ళీ సఫలమవుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026పై కన్ను
ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరైన సమయంలో ఫామ్లోకి రావడం టీమ్ ఇండియాకు అతిపెద్ద సానుకూలాంశం. భారత్ తన సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. సూర్యతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా మంచి ఫామ్లో ఉండటం భారత్కు మూడవ టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలను పెంచుతోంది.
