ఐపీఎల్ 15వ సీజన్ లో ప్లేఆఫ్స్కి చేరువలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మరో శుభవార్త అందింది. ఆ జట్టు పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్ తిరిగి జట్టుతో కలిసాడు. ఇటీవల తన భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో వారిని చూసేందుకు హెట్మైర్ సొంతగడ్డకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరిగి బయో బబుల్ లో చేరిన హెట్మైర్ మే 20న చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. ఇక ఈ సీజన్లో చక్కగా రాణిస్తున్న హెట్మైర్ ఇప్పటివరకు 11 మ్యాచ్లాడి 291 పరుగులు సాధించాడు.
లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్కు మరింత దగ్గరైంది. మొదట రాజస్తాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఇక తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మొత్తం 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఆ జట్టు ఇంకా లీగ్ దశలో ఒక మ్యాచ్ మాత్రమే ఆడనుండగా.. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకుందని చెప్పొచ్చు. అలానే లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ .. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. దాంతో.. ప్రస్తుతం ఆ జట్టు కూడా ప్లేఆఫ్స్కి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే రాజస్థాన్, లక్నో తర్వాత ఉన్న ఐదు జట్లలో ఏ జట్టుకి కూడా 16కిపైగా పాయింట్లు సాధించే ఛాన్స్ లేదు.