సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్ జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో రెండోసారి విజేతగా నిచిలింది. శనివారం రాత్రి రాయ్పూర్లో జరిగిన ఫైనల్ పోరులో ఇండియా లెజెండ్స్ 33 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. ట్రోఫీ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో స్పందించారు. “అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికీ ఇండియానే. అద్భుత ప్రదర్శన చేసిన మా జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో మరోసారి విజేతగా నిలిచింది. నమన్ ఓఝా బ్యాటింగ్ అద్భుతం. ఈ విజయం మా జట్టు సభ్యులు, అభిమానులది “అని సచిన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది.
For India then, now & forever! 🇮🇳
A fantastic effort from the team to win the #RoadSafetyWorldSeries once again. The way @namanojha35 batted last night was simply brilliant.This is for all my teammates and amazing fans! 💙 pic.twitter.com/QAfnGlklkR
— Sachin Tendulkar (@sachin_rt) October 2, 2022
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచినా ఇండియా లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. ఇండియా లెజెండ్స్ బ్యాటింగ్ లో నమన్ ఓఝా (108 నాటౌట్), వినయ్ కుమార్ (36) రన్స్తో రాణించారు. సచిన్ టెండూల్కర్ (0), సురేష్ రైనా (4) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ కులశేఖర 3 వికెట్లు, ఉదానా రెండు వికెట్లు తీశారు.
అనంతరం 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ జట్టు 18.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక జట్టులో ఇషాన్ జయరత్నే (51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో వినయ్ కుమార్ మూడు, అభిమన్యు మిథున్ 2వికెట్లతో రాణించారు. నమన్ ఓఝాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దిల్షాన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.