Yash Dayal: ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ఐపీఎల్ 2026లో ఆడటం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. యశ్ దయాల్ ఈసారి ఆర్సీబీ తరపున బరిలోకి దిగడం లేదని, అయితే అతను ఇంకా జట్టు కాంట్రాక్టులోనే ఉన్నాడని యాజమాన్యం తెలిపింది. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బొబాట్ మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా యశ్ ఈ సీజన్కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. గతంలో బెంగళూరు జట్టు యశ్ దయాల్ను 5 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల శిక్షణ శిబిరం (ట్రైనింగ్ క్యాంప్) ప్రారంభమైంది. కానీ యశ్ దయాల్ అందులో కనిపించలేదు. దీనిపై చర్చ జరుగుతున్న తరుణంలో మంగళవారం మీడియా సమావేశంలో మో బొబాట్ స్పష్టతనిచ్చారు. యశ్ ప్రస్తుతం కొన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నాడని, ఇరు పక్షాల అంగీకారంతోనే ఐపీఎల్ 2026లో అతను ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Also Read: ఐపీఎల్ 2026.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు!
యశ్ దయాల్పై ఉన్న ఆరోపణలు ఏమిటి?
యశ్ దయాల్పై లైంగిక వేధింపులకు సంబంధించి రెండు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2025 జూలైలో ఘజియాబాద్లో అతనిపై మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐదేళ్లపాటు రిలేషన్లో ఉండి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడని ఒక మహిళ అతనిపై ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఒక మైనర్ బాలిక అతనిపై పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది. 2023 తర్వాత సదరు క్రికెటర్ తనను లైంగికంగా వేధించాడని, కెరీర్లో ముందుకు తీసుకెళ్తానని నమ్మించి లోబర్చుకున్నాడని ఆ బాలిక ఆరోపించింది.
న్యాయపరమైన స్థితిగతులు
ఘజియాబాద్ కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్ అరెస్టుపై స్టే విధించింది. అయితే జైపూర్లోని ఒక పోక్సో కోర్టు 2025 డిసెంబర్లో సాక్ష్యాధారాల తీవ్రతను, కొనసాగుతున్న విచారణను పరిగణనలోకి తీసుకుని అతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
