RCB: ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో హోమ్ వెన్యూ (రెండో వేదిక) కోసం వెతుకుతోంది. అయితే నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఇప్పుడు ఆప్షన్లో లేదు. డీవై పాటిల్ గురించి ఆలోచించే ముందు ‘ఇతర ఆప్షన్లను చూసుకోవాలని’ ముంబై ఇండియన్స్, బెంగళూరు ఫ్రాంచైజీకి సూచించినట్లు సమాచారం. ఎందుకంటే ఈ రెండు స్టేడియాలు ఒకే క్యాచ్మెంట్ ఏరియా (ఒకే ప్రాంతం) పరిధిలోకి వస్తాయి.
‘RCB ఇతర ఆప్షన్లను చూసుకోవాలి’
ఒక మూలం సమాచారం ప్రకారం.. ఒక ఫ్రాంచైజీ మరో ఫ్రాంచైజీ హోమ్ ఏరియాకు దగ్గరగా తన హోమ్ బేస్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే దానికి ముందస్తు క్లియరెన్స్ అవసరం. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియంలు చాలా దగ్గరగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ అనుమతి లేకుండా ఏ ఫ్రాంచైజీ కూడా డీవై పాటిల్లో మ్యాచ్లు నిర్వహించలేదు. కేవలం డీవై పాటిల్ మాత్రమే ఎందుకు? దేశంలో ఇంకా చాలా స్టేడియాలు ఉన్నాయి కదా అని ఎంఐ ప్రశ్నించింది. డీవై పాటిల్ కంటే ముందే ఆర్సీబీ ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది అని తెలిపింది.
Also Read: దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?
నాన్-ఐపీఎల్ సెంటర్లపై మొగ్గు
రాజ్కోట్, పూణె, రాయ్పూర్, వైజాగ్, ఇండోర్ వంటి సెంటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ముంబై ఇండియన్స్ డీవై పాటిల్కు అంగీకరిస్తే రేపు మరో టీమ్ వచ్చి బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్లు ఆడతామని అడగవచ్చు. దీనివల్ల ‘హోమ్ టెరిటరీ’ (సొంత ప్రాంతం) ప్రాధాన్యత దెబ్బతింటుంది. ఆర్సీబీ ఇతర ప్రాంతాలను వదిలి కేవలం డీవై పాటిల్పైనే ఎందుకు ఆసక్తి చూపిస్తుందో స్పష్టమైన కారణం ఉండాలి అని సదరు సోర్స్ పేర్కొంది.
రాయ్పూర్తో చర్చలు?
రాయ్పూర్లో కనీసం రెండు మ్యాచ్లు నిర్వహించేందుకు ఆర్సీబీ ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మిగిలిన మ్యాచ్ల కోసం ఇండోర్ ఒక బలమైన ఆప్షన్గా కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వ అనుమతి లభించే వరకు చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, KSCAకి ఇవ్వాల్సిన ఆదేశాలపై బుధవారం జరిగే సమావేశంలో సీనియర్ అధికారులు, పోలీసులు, న్యాయ నిపుణులు చర్చించనున్నారు. జస్టిస్ డి’కున్హా కమిటీ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంపై దృష్టి సారించనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఆమోదం కూడా అవసరం.
