ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం కైవసం చేసుకున్న టీమిండియాకు (Team India) మరో గుడ్ న్యూస్…ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నెంబర్ వన్ గా నిలిచాడు. తాజాగా విడుదలైన జాబితాలో సిరాజ్ 729 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్ళాడు. గత ఏడాది కాలంగా సిరాజ్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. గత 20 మ్యాచ్ లలో ఈ హైదరాబాదీ పేసర్ 37 వికెట్లు పడగొట్టాడు. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (Gavaskar Trophy) అదరగొట్టిన సిరాజ్ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ లోనూ కీలకంగా మారిపోయాడు.
బూమ్రా (Bumrah) జట్టుకు దూరమవడంతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో సీరీస్ లో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. గత ఏడాది భారత్ తరపున హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా సిరాజ్ నిలిచాడు. ప్రస్తుతం ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్ 10లో భారత్ నుంచి సిరాజ్ కు మాత్రమే చోటు దక్కింది. 2019లో వన్డే అరంగేట్రం చేసిన సిరాజ్ 21 మ్యాచ్ లలో 20.76 సగటుతో 38 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం సిరాజ్ కెరీర్ లో ఇదే తొలిసారి.