దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 లీగ్ సమరానికి తెరపడింది. ఎన్నో మలుపులు, అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగిన ఈ దశలో చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో గెలవడంతో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలు గల్లంతయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్ జట్లు 14 మ్యాచ్లలో 9 విజయాలతో చెరో 18 పాయింట్లు సాధించాయి. అయితే, మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో, సన్రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. ఇక 14 మ్యాచ్లలో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.
ఈసారి పంజాబ్ ప్రస్థానం అతిపెద్ద ట్విస్ట్
ఈ సీజన్లోనే అతిపెద్ద ట్విస్ట్గా పంజాబ్ కింగ్స్ ప్రస్థానం నిలిచింది. టోర్నీ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్లలో ఓటమే ఎరుగని ఆ జట్టు, ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పంజాబ్ 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ (14), కోల్కతా నైట్ రైడర్స్ (13), చెన్నై సూపర్ కింగ్స్ (12) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చెరో 8 పాయింట్లతో చివరి రెండు స్థానాలతో సీజన్ను ముగించాయి.
రేపటి నుంచి ప్లే ఆఫ్స్.. మే 31న ఫైనల్ మ్యాచ్
లీగ్ మ్యాచ్లన్నీ ముగియడంతో ఇక అందరి దృష్టి ప్లే ఆఫ్స్పైనే నిలిచింది. మే 26 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా, మే 31న జరిగే ఫైనల్తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. క్వాలిఫయర్-1లో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ, రెండో స్థానంలోని గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
