IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఏప్రిల్ 25 (శనివారం) గత 18 ఏళ్లలో ఎన్నడూ చూడని అద్భుతం చోటుచేసుకుంది. టోర్నీ చరిత్రలోనే ఒకే రోజు అత్యధిక పరుగులు నమోదైన రికార్డు బద్ధలైంది. శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో భాగంగా.. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి.
పంజాబ్ చారిత్రాత్మక రన్ ఛేజ్
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ తరపున కేఎల్ రాహుల్ 152 పరుగులతో వీరవిహారం చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ రన్ ఛేజ్ను విజయవంతంగా పూర్తి చేసింది. కేవలం 18.5 ఓవర్లలోనే 265/4 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.
Also Read: ప్రేమ పేరుతో ట్రాప్.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి
హైదరాబాద్ అదిరిపోయే విజయం
రాత్రి 7.30 గంటలకు జరిగిన రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులతో సెంచరీ సాధించాడు. లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. కేవలం 18.3 ఓవర్లలో 229/5 పరుగులు చేసి గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
986 పరుగులు.. పాత రికార్డు కనుమరుగు
ఈ రెండు మ్యాచ్లు కలిపి శనివారం ఏకంగా 986 పరుగులు నమోదయ్యాయి. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో 529 పరుగులు, జైపూర్లో జరిగిన మ్యాచ్లో 457 పరుగులు వచ్చాయి. అంతకుముందు 2024 ఏప్రిల్ 27న ఒకే రోజు 899 పరుగులు రావడమే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైపోయింది.
సిక్సర్ల రికార్డు కూడా బద్ధలు
కేవలం పరుగులే కాదు సిక్సర్ల విషయంలోనూ కొత్త రికార్డు నెలకొంది. శనివారం జరిగిన రెండు మ్యాచ్లలో కలిపి మొత్తం 59 సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు అత్యధికంగా ఒకే రోజు 53 సిక్సర్లు నమోదైన రికార్డు ఉండేది. సిక్సర్లతో పాటు 96 ఫోర్లు కూడా బాదారు.
