IND vs NED Predicted XI: పాకిస్థాన్ను ఓడించి టీమ్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశకు చేరుకుంది. సూపర్-8 ప్రారంభానికి ముందు గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ను ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో ఆడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయింగ్-11లో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా బుమ్రా, పాండ్యాకు విశ్రాంతినివ్వవచ్చు.
టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో మార్పులు
సూపర్-8 దశకు ముందు భారత క్రికెట్ జట్టు తన బెంచ్ బలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వవచ్చు. బుమ్రా నేరుగా సూపర్-8 మ్యాచ్ల్లోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అతని స్థానంలో మొహమ్మద్ సిరాజ్కు మరోసారి అవకాశం దక్కవచ్చు. గతంలో అమెరికా (USA)పై సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యాకు కూడా విశ్రాంతినిచ్చే ఆలోచనలో కెప్టెన్, కోచ్ ఉన్నారు.
Also Read: సెమీఫైనల్కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్తో ఫైనల్ మ్యాచ్!
హార్దిక్ పాండ్యా స్థానంలో వాషింగ్టన్ సుందర్కు అవకాశం లభించవచ్చు. గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన సుందర్ను సూపర్-8కు ముందు పరీక్షించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అలాగే కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు ఉంటారు. వీరికి శివమ్ దూబే అదనపు బౌలర్గా సహకరిస్తారు. స్పిన్ విభాగ బాధ్యతలను వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చూసుకోనున్నారు.
భారత జట్టు (సాధ్యమయ్యే ప్లేయింగ్-11)
- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్
