Jasprit Bumrah: స్పందించిన బుమ్రా.. త్వ‌ర‌లోనే జ‌ట్టుతో క‌లుస్తా..!

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి దూర‌మైన‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 06:45 AM IST

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి దూర‌మైన‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే బీసీసీఐ చెప్పిన ఈ వార్త‌ను అటు టీమిండియా.. ఇటు క్రికెట్ అభిమానుల‌కు నిరాశ‌కు గురిచేసింది. వెన్నుముక గాయం కార‌ణంగా సౌతాఫ్రికా టీ20 సిరీస్ నుంచి దూర‌మైన విష‌యం తెలిసిందే. అయితే బుమ్రా స్థానంలో బీసీసీఐ సెలెక్ట‌ర్లు సిరాజ్‌ను తీసుకున్నారు.

గాయం నుంచి పేస‌ర్ బుమ్రా కోలుకోవాలంటే 4 నుంచి 6 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అధికారులు కూడా బుమ్రాను.. ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి జ‌ర‌గబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు దూర‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌కు దూరం అయినా ధైర్యంగానే ఉన్నానని పేర్కొన్నాడు. త్వరలోనే గాయం నుంచి కోలుకుని జట్టుతో క‌లుస్తాన‌ని ఆశాభావం వ్యక్తం చేశాడు.

బుమ్రా మాట్లాడుతూ.. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భాగం కాలేకపోతున్నందుకు కాస్త బాధ‌గానే ఉంది. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. నేను కోలుకోవాలని కోరుకుంటూ మద్దతుగా నిలుస్తున్నా నా టీమ్ స‌భ్యుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు.. ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. గాయం నుంచి త్వరలోనే కోలుకుని నా జట్టుతో క‌లుస్తా. వారిని ఉత్సాహపరుస్తా అంటూ ట్విట్ట‌ర్‌ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు మరో ఆటగాడిని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉంది. అయితే.. బుమ్రా టీ20 వ‌ర‌ల్ట్‌క‌ప్‌కు లేక‌పోవ‌టం టీమిండియాకు పెద్ద లోటేన‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.