టీమిండియాకు మరో భారీ షాక్ తగలనుంది. గాయం కారణంతో మరో భారత జట్టు ప్లేయర్ టీ20 వరల్డ్ కప్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలు గాయాల కారణంగా జట్టు దూరమైన విషయం తెలిసిందే. వారి బాటలోనే మరో యువ బౌలర్ దీపక్ చాహర్ టీ20 ప్రపంచకప్కు దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో చివరి రెండు వన్డేలకు చాహర్ గాయం కారణంగా ఆడలేకపోయాడు. అయితే.. టీ20 ప్రపంచకప్కు అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ అలాంటి ఛాన్స్ లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చాహర్ టీ20 ప్రపంచకప్కు ఎంపికైన జట్టులో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న విషయం తెలిసిందే.
దీపక్ చాహర్ వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచకప్కు దూరం కావడంతో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే తొలి మ్యాచ్కు ముందు భారత పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టులో చేరే అవకాశముంది.‘‘చాహర్ ఫిట్నెస్ సాధించడానికి సమయం పట్టేలా ఉంది. వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. అందుకే బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్లను ఆస్ట్రేలియాకు పంపించనుంది. షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వెళ్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈనెల 16నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్ జరగనున్న విషయం తెలిసిందే.