IPL 2023 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీని అట్టిపెట్టుకుంది. అదే సమయంలో వచ్చే సీజన్లో ధోనీ CSK కెప్టెన్గా కనిపిస్తాడని కూడా CSK జట్టు స్పష్టం చేసింది. మరోవైపు ధోనీని CSK కెప్టెన్గా కొనసాగించడంపై భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ.. ‘మహేంద్రసింగ్ ధోనీ ఉన్నంత వరకు సీఎస్కేకు కెప్టెన్ గా మరొకరు ఉండరు. గతేడాది ఇది స్పష్టంగా కనిపించింది. అయితే మీరు ఈ ప్రశ్నను ఒక సంవత్సరం క్రితం అడిగి ఉంటే నా సమాధానం భిన్నంగా ఉండేది. ధోనీ తర్వాత కేన్ విలియమ్సన్ కి సీఎస్కే కెప్టెన్సీ దక్కితే బాగుంటుందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. ధోనీ తర్వాత కొన్నేళ్ల పాటు టీమ్ని నడిపించే నాయకుడు కావాలి. కనీసం 5-6 ఏళ్లు ఆ బాధ్యతను మోయగలగాలి. కేన్ ఆ పని చేయలేడు. సీఎస్కే కొత్త కెప్టెన్ని తయారుచేసే పనిలో ఉందని అనుకుంటున్నా అని తెలిపాడు.
గత ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ కెప్టెన్సీని వదులుకుని రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించాడు. జడేజా కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా కొనసాగింది. ఆ తర్వాత సీజన్ మధ్యలోనే జడేజా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ధోనీ మళ్లీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023 సీజన్కు ముందు జడేజాను రిటైన్ చేసినప్పటికీ వచ్చే సీజన్కు ధోని మాత్రమే కెప్టెన్గా ఉంటాడని టీమ్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. జడేజా, టీమ్ మేనేజ్మెంట్ మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. అయితే ధోని జోక్యం తర్వాత ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జడేజా మళ్లీ CSK తరుపున ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.