Chris Gayle: టీ20 క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ ఇప్పుడు ఒక కొత్త జట్టుకు యజమాని అయ్యారు. ‘యూనివర్స్ బాస్’ యూరోపియన్ టీ20 లీగ్లో ఒక జట్టును కొనుగోలు చేశాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ గ్లాస్గో ఫ్రాంచైజీకి సహ యజమానిగా మారాడు. ఈ లీగ్కు ఇది మొదటి సీజన్ కాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఈ లీగ్లో సహ యజమానిగా ఉన్నారు. ఈ లీగ్ను 2025లో ప్రారంభించినప్పటికీ టోర్నమెంట్ మాత్రం ఈ ఏడాదే మొదలుకానుంది. ఈ లీగ్లో క్రిస్ గేల్ భాగస్వామ్యం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ లీగ్లో మరికొంతమంది దిగ్గజ తారలు కూడా కనిపించబోతున్నారు.
గేల్ గురించి అభిషేక్ ఏమన్నారంటే?
క్రిస్ గేల్ను ఈ లీగ్లోకి ఆహ్వానిస్తూ అభిషేక్ బచ్చన్ ఇలా అన్నారు. “ముగాఫీ గ్రూప్, క్రిస్ గేల్ను ఈ ప్రయాణంలోకి ఆహ్వానిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఐరోపా క్రికెట్కు ఇది ఎంతో ఉత్సాహభరితమైన విషయం. ఇక్కడ క్రీడా సంస్కృతి, వైవిధ్యం, అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ లీగ్ ద్వారా కొత్త ప్రతిభావంతులకు తమ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తాము” అన్నారు. అదే సమయంలో క్రిస్ గేల్ ఈ ప్రత్యేక సందర్భం గురించి మాట్లాడుతూ.. “ETPL గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫ్రాంచైజీ లీగ్లు ఆడాను. ఈ లీగ్ ఖచ్చితంగా ప్రత్యేకం అవుతుందని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.
Also Read: Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !
ఈ లీగ్తో ముడిపడి ఉన్న పలువురు తారలు
క్రిస్ గేల్తో పాటు గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ వా వంటి ఆటగాళ్లు కూడా ఈ లీగ్తో సంబంధం కలిగి ఉన్నారు. ఆమ్స్టర్డ్యామ్ ఫ్రాంచైజీకి స్టీవ్ వా, ఆస్ట్రేలియా మాజీ హాకీ కెప్టెన్ జేమీ ద్వైయర్ నాయకత్వం వహిస్తారు. అదేవిధంగా ఎడిన్బర్గ్ జట్టుకు న్యూజిలాండ్ మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ యజమానులుగా ఉంటారు. ఈ లీగ్ మొదటి సీజన్ ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. టోర్నమెంట్లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. వీటి మధ్య 33 మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లన్నీ గ్లాస్గో, ఆమ్స్టర్డ్యామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్డ్యామ్ వంటి 6 వేర్వేరు నగరాల్లో నిర్వహించనున్నారు.
