టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. భారత స్పీడ్స్టర్ జస్ప్రీత్ బూమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో బూమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లంకతో సిరీస్ కోసం బూమ్రాను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. బూమ్రా ఫిట్నెస్ టెస్ట్ పాసవడంతో అతన్ని జట్టులోకి తీసుకున్నామని తెలిపింది. బూమ్రా టీమిండియాకు దూరమై దాదాపు 6 నెలలు దాటిపోయింది. గాయంతో స్వదేశంలో గత ఏడాది సౌతాఫ్రికా సిరీస్ నుంచి వైదొలిగిన ఈ స్టార్ పేసర్ తర్వాత ఆసియాకప్, టీ ట్వంటీ ప్రపంచకప్లకూ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. బూమ్రా లేకపోవడంతో ప్రపంచకప్లో భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే ఈ స్టార్ పేసర్ సేవలను కోల్పోయిన టీమిండియా సెమీస్లో నిష్క్రమించింది. అప్పటి నుంచీ చికిత్స తీసుకుంటున్న బూమ్రా గత నెలలో జాతీయ క్రికెట్ అకాడమిలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
అంతకుముందు జరిగిన కొన్ని అనుభవాల నేపథ్యంలో బీసీసీఐ వెంటనే బూమ్రాను జట్టులోకి తీసుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్ట్ ముగిసిన తర్వాతే పాజిటివ్ రిజల్ట్ ఉంటే జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే కొత్త ఏడాదిలో లంకతో సిరీస్కు బూమ్రా ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు ఫిట్నెస్ సాధించడంతో బూమ్రాను వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. బూమ్రా ఎంట్రీతో భారత పేస్ బలం మరింత బలపడనుంది. బూమ్రాతో పాటు మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్సింగ్ పేస్ భారాన్ని మోయనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ మూడు వన్డే సిరీస్ జనవరి 10 నుంచి ఆడనుంది.
శ్రీలంకతో వన్డేలకు టీమిండియా ః
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్