ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మొదటి టెస్టులో ఆడడని టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. దీంతో అతడు స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్ లలో ఒకరికి చోటు దక్కనుంది. శ్రేయాస్ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది 5 టెస్టుల్లో 60 సగటుతో 422 పరుగులు చేశాడు. దీనిలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
డిసెంబరులో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శ్రేయాస్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. ఫిట్ నెస్ సాధించిన తర్వాత జట్టుతో కలిసే అవకాశముంది. రెండో టెస్ట్ సమయానికి శ్రేయస్ కోలుకుంటాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే టెస్టుల్లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ ఆడుతుండగా.. మిడిలార్డర్ లో కీలకంగా ఉండే ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Australia Batsman: వీసా ఆలస్యం కావడంతో ఫ్లైట్ ఎక్కని ఆసీస్ ఓపెనర్..!
వన్డే, టీ ట్వంటీల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నాగ్ పూర్ లో ఫిబ్రవరి 9 నుంచి మొదలు కానుంది. రెండో టెస్టుకు ఢిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల , నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి.’