IPL 2025: గుజరాత్ టైటాన్స్ కు నెహ్రా బై..బై.. కొత్త కోచ్ గా సిక్సర్ల కింగ్

ఆశిష్ నెహ్రా స్థానంలో సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ను గుజరాత్ టైటాన్స్ తమ కోచ్ గా నియమించకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనిపై యువీతో చర్చలు కూడా జరిపినట్టు, అతను కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం

IPL 2025: ఐపీఎల్ వేలానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటకీ ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో అప్పుడే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొందరు కీలక ప్లేయర్లు కూడా వేలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి చాలా జట్లలో మార్పులు ఖాయమని చెప్పొచ్చు. కేవలం ఆటగాళ్ళలోనే కాదు సపోర్టింగ్ స్టాఫ్ లోనూ మార్పులు జరగనున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ కు కోచ్ ఆశిష్ నెహ్రా ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. తానే వీడాలనుకుంటున్నాడా లేక ఫ్రాంచైజీనే తప్పిస్తోందా అన్న దానిపై క్లారిటీ లేదు. గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్ నుంచి నెహ్రా ఆ జట్టుతోనే ఉన్నాడు. మూడు సీజన్లలో రెండుసార్లు గుజరాత్ ను ఫైనల్ చేర్చడంలో నెహ్రా పాత్ర చాలానే ఉంది. ముఖ్యంగా ఫుట్ బాల్ కోచ్ తరహాలో బౌండరీ దగ్గర తిరుగుతూ ఆటగాళ్ళను మోటివేట్ చేస్తూ సక్సెస్ అయ్యాడు.

యువ ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో ముందుండే నెహ్రాకు 17వ సీజన్ మాత్రం కలిసిరాలేదు. గుజరాత్ టైటాన్స్ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సీజన్ కు ముందు అతను జట్టును వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆశిష్ నెహ్రా స్థానంలో సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ను గుజరాత్ టైటాన్స్ తమ కోచ్ గా నియమించకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనిపై యువీతో చర్చలు కూడా జరిపినట్టు, అతను కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా గుజరాత్ కు గుడ్ బై చెప్పనున్నాడు.
ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏదీ లేకున్నా మార్పులు మాత్రం ఖాయమని గుజరాత్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

కాగా ఇప్పటికే పలు ఫ్రాంచైజీల తమ తమ కోచింగ్ స్టాఫ్ పైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్ కు ఉద్వాసన పలికింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ తో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ టీమిండియా మాజీ కోచ్ ద్రావిడ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. అటు లక్నో సూపర్ జెయింట్స్ వీవీఎస్ లక్ష్మణ్ ను మెంటార్ గా నియమించుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: MLC Kavitha : బిడ్డ జైల్లో ఉంటే తండ్రిగా బాధ ఉండదా..? – KCR

Follow us